Wednesday, September 24, 2008

పరాన్నజీవిగా అమెరికా సామ్రాజ్యవాదం

తనఖా ద్రవ్య సంస్థలైన ఫాన్నీమే , ఫెడ్డీమాక్ కంపెనీలను అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ రెండు సంస్థలూ కలిపి 5 లక్షల 30 వేల కోట్ల డాలర్ల అప్పుల్లో మునిగిపోయాయి. అమెరికా గృహ రుణాలలో 80 శాతాన్ని ఈ రెండు కంపెనీలే తనఖా పెట్టుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ అప్పులు తీరుస్తానని హామీ పడింది. ప్రజలనుండి వసూలు చేసిన పన్నుల నుండే ఈ అప్పులు తీరుస్తుంది. దీని అర్ధమేమిటి? గుత్తపెట్టుబడదారులకు వచ్చిన నష్టాలను సమాజపరం చేస్తారు. లాభాలను ప్రవేటు పరం చేస్తారు.
రెండు కంపెనీలను రక్షించడానికి ఖర్చుపడుతున్న ఈ సొమ్ము ప్రజలకోసం వెచ్చించే సొమ్ముతో పోల్చి చూస్తే అమెరికా ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో తెలుస్తుంది. విద్యకు 6 వేలకోట్ల డాలర్లు, నిరుద్యోగ భృతికి 3 వేలకోట్లు, రహదారులకోసం 5 వేలకోట్లు, గృహవసతి కల్పనకు 7000 కోట్లు మాత్రమే. కంపెనీలు తమ పెట్టుబడితో జూదమాడుతాయి. లాభాలొస్తే తమ బొక్కసాలు నింపుకుంటాయి.నష్టాలు వస్తే ప్రజలు భరించాలి. ఇది సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థ దివాళాకోరు తనాన్ని తెలుపుతుంది.

Tuesday, September 23, 2008

పాకీస్తానీ ప్రజాతంత్ర కవి అబ్దుల్ ఫరాజ్

పాకీస్తానీ నియంతలకు పక్కలో బల్లెమై నిలచిన పాకీస్తానీ ప్రజాతంత్ర కవి అబ్దుల్ ఫరాజ్
“నిరంకుశత్వ మేదియైన నిలువలేదు జగతిపై
దురాత్ములైన హిట్లరాదు లొరిగిపోయి రుర్విపై
ప్రజావిరోధి ఎవ్వడైన బ్రతుకలేడు నిశ్చయం
ప్రజాబలాల ధాటినాప ఎవరితరము కాదుపో “

అని మన తెలుగు ప్రజాకవి సుంకర సత్యనారాయణ తన మార్చింగ్ సాంగ్ లో నియంతలనూ, ప్రజా వ్యతిరేకులను ప్రతిఘటిస్తూ వ్రాశారు. పాకిస్తాన్ లోని సైనిక నియంతృత్వాన్ని ప్రతిఘటిస్తూ రచనలు సాగించిన కవుల్లో ప్రముఖుడు అబ్దుల్ ఫరాజ్ . ఆయన కోహట్ సమీపాన గల ఒక గ్రామంలో 1931 జనవరి 14 న జన్మించారు. తన 77 వ ఏట మొన్న 2008 ఆగష్టు 25వ తేదీన ఇస్లామాబాద్ లో మూత్రపిండాల వ్యాధితో మరణించారు. ఉర్దూ సాహితీ ప్రపంచంలో ఫరాజ్ నియంతల ప్రజా వ్యతిరేకతను సూటిగా , నిష్కర్షగా తన కవితలలో , గజల్లలో ఎండగట్టాడు. ఉదాహరణకు “ పెషావర్ ఖతి” లో “ తుమ్ సిపాహీ నహీం” అనే పాదంతో ప్రారంభమయ్యే కవిత ఇలా సాగుతుంది. తూర్పు పాకీస్తాన్ ( ఇప్పుడు బాంగ్లాదేశ్ ) లో , బెలూచీస్తాన్ లో పాకీస్తానీ సైన్యం సృష్టించిన దారుణ మారణ కాండను ఖండిస్తూ ఈ కవిత వ్రాశాడు.
“ మీరు వృత్తి హంతకులు, సైనికులు కారు
ఇప్పటి వరకు మీ కోసం విషాద గీతికలు
రచించాను
అవి రాసినందుకీనాడు సిగ్గుతో చితికి
పోతున్నాను
ఆ తూర్పున ఉన్నవాళ్ళు - మన రక్తసంబంధీకులే
వాళ్ళు మనవాళ్ళే ...మీరేమో వారి రక్తంతో హోలీ
చేసుకుంటున్నారు.
.................
వారి అదృష్టాలను మరల్చడానికి వెళ్ళారక్కడికి
మీరు చేసినదాని ఫలితం చూడండిప్పుడు
మీ లైంగిక అత్యాచారాల ఫలితం ఈనాటి
వారి పిల్లలు.
.........................
బెంగాల్ లో రక్తస్నానం పూర్తిచేసి
ఇక బయలుదేరారు బోలన్ పౌరుల
గొంతులు కోయడానికి “
ఫరాజ్ అసలు పేరు సయ్యద్ మహమ్మద్ షా . ఫరాజ్ అనేది ఆయన కలం పేరు. తండ్రి ఆగా సయ్యద్ మహమ్మద్ షా బార్క్ కోహట్ సంప్రదాయ కవిత్వరచనలో పేరు గడించినవాడు.
ఫరాజ్ పెషావర్ విశ్వవిద్యాలయంలో ఉర్దు, పర్షియన్ భాషలలో ఎం.ఏ. పట్టా పొంది ఆ విశ్వవిద్యాలయం లోనే అధ్యాపకునిగా పని చేశాడు. 1976 లో పాకీస్తాన్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అనే సాహిత్య అకాడమీకి సంస్థాపక డైరెక్టర్ జనరల్ గానూ, ఆ తర్వాత చైర్మన్ గానూ పనిచేశాడు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక కవి సమ్మేళనంలో తాను వ్రాసి, చదివిన కవితల కారణంగా అరెష్టు అయ్యాడు. భుట్టో నాయకత్వంలోని పాకీస్తాన్ పీపుల్స్ పార్టీలో పనిచేశాడు. 2004లో ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అయిన హిలాల్ -ఇ-ఇమితియాజ్ ను పొందాడు.
అయితే ఇటీవల న్యాయమూర్తులను పదవులనుండి తొలగించడం, అమెరికాకు తొత్తుగా మారడం వంటి ముషారాఫ్ చర్యలకు నిరసన తెలియజేస్తూ 2006 లో ఆ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. 2007 నవంబరులో ఢిల్లీలో రెండు దేశాల మధ్య సంబంధాల గురించి, రెండు దేశాలలోని ఉర్దూ సాహిత్యం గురించి గొప్ప ఉపన్యాసము ఇచ్చారు. ఆయన మరణం ఇరు దేశాల సాంస్కృతిక ఉద్యమానికి ఒక లోటుగా పరిగణించక తప్పదు.

Wednesday, September 10, 2008

గుడ్డీగ

మంచోడి బుధ్ది మాంసం కాడ బయటపడ్డట్టు
బుద్ధదేవ్ ఎవరి పక్షమో నందిగ్రామ్ లో తెలిసిపోయింది
నీరు పల్లానికే ప్రవహించినట్టు
పాలక కమ్యూనిష్టుపార్టీ
టాటాలు , సలీంల వైపుకు పరుగెత్తుతున్నాయి
పోరాడితే పోయేదేమీలేదని చెప్పేవాళ్ళు
పోరాడే ప్రజల్ని
పిట్టల్లా కాల్చి చంపుతున్నారు
నీడనివ్వాల్సిన చెట్టు నిప్పులు కురిపించిందిక్కడ
కట్టుకున్న చీరే కామంతో శీలం దోచిందిక్కడ
కాపాడాల్సిన కమ్యూనిష్టే కసాయిగా మారి
మరతుపాకులెత్తి మట్టి మనుషుల మానప్రాణాలు తీశాడిక్కడ
దేవాలయాల మెట్ల వద్ద
మంచినీళ్ళ బావుల దగ్గర
సవర్ణులు దళితుల్ని తరిమి కొట్టినట్టు
పచ్చటి పంట పొలాల్లో
పారిశ్రమిక పెంటదిబ్బల్ని వొద్దన్నందుకు
మనిషి వాసన తగిలితేనే బుసలు కొట్టే క్రూరజంతువులా
పీడితులపై బులెట్ల వర్షం కురిపించాడు అభినవ డయ్యరిష్టు
శ్రమైక జీవన సౌందర్యానికి
పట్టాభిషేకం చెయ్యాల్సినవాడు
శ్రమజీవుల పొట్టలుగొట్టి
బూర్జువాలకు పట్టంగడుతున్నాడు
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వుద్యమించాల్సిన కార్మికరాజ్యం
తలుపులు బార్లా తెరిచి పెట్టుబడిదారులకు స్వాగతం
పలుకుతుంది
రైతు కూలీలు జిందాబాద్
రైతురాజ్యం సాధిస్తామ్ అని నినదించే వామపక్షీయులు
లాఠీలై , తూటాలై
ప్రజాపోరాటాల్ని నెత్తురుటేరుల్లో ముంచెత్తుతున్నారు
పేదలకు భూములు పంచాలంటు
దున్నేవాడికే భూమి దక్కాలంటూ
వ్యవసాయిక విప్లవం వర్ధిల్లాలంటూ
రైతు సంఘాలై వ్యవసాయ కార్మిక మహాసభలై
భూమికోసం భుక్తికోసం ఈ దేశ విముక్తికోసం
పోరుచేసే కమ్యూనిష్టు పార్టీ
పంటభూముల్లో రసాయనిక పరిశ్రమలు ఎందుకన్న నేరానికి
పచ్చటి నేలంతా నెత్తుటిమయం చేసింది
ఇల్లలికి ముగ్గు పెట్టుకొని
తన పేరు తానే మరచిపోయిన గుడ్డీగలా
వర్గాన్ని, వర్గపోరాటాన్ని మరచిపోయారు
“ భారతీయ కమ్యూనిష్టులు “
అధికారపు మత్తులో కూరుకుపోయి
ప్రజల్ని మరచిన
ప్రభుత్వ కమ్యూనిష్టులారా !
నందిగ్రామ్ లో ఉవ్వెత్తున లేచిన నెత్తుటి కెరటం
అణగారిన ప్రజల గుండెల్లో రగిలే తఫానుకు సూచన.
ఇక మీ పతనం తప్పదు
-----
మల్లిఖార్జున పిల్లి