Wednesday, November 19, 2008

మెట్రోరైలు ప్రాజక్టును రద్దు చేయాలి

హైదరాబాదు నగర ట్రాఫిక్కు నరకలోకానికి మరోపేరు.ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకుపోయి ప్రయాణం సాగకపోవడం వాహనదారుల సమస్య. పాదచారులూ, సైకిలిష్టులూ ప్రాణాలరచేతిలో పెట్టుకుని రోడ్డెక్కాల్సిన స్థితి. ఒక పెద్ద ప్రమాదం జరగ్గానే హడావుడిగా క్రమబద్ధం చేసేపేరిట కొత్త నియమాలు ప్రకటించడం, మరోవైపు రోడ్లు వెడల్పుచేసి కార్లు బాగా పరుగులు తీసే ఏర్పాట్లుచెయ్యడం వంటి ప్రదర్శనాత్మకమైన పనులు చేపడతారు.వెడల్పుచేసిన రోడ్లలోకూడా పుట్ పాత్ లుండవు. ఎక్కడా సరైన బస్టాపులుండవు.

1965లో పాకీస్తాన్ తో యుద్ధం తరువాత కొన్ని కీలక పరిశ్రమలను సరిహద్దులకు దూరంగా దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చెయ్యాలని కేంద్రం నిర్ణయించింది. దానిలో భాగంగానే డి.ఆర్.ఎల్. , బి.హెచ్. ఇ.ఎల్. ,ఇ.సి.ఐ.ఎల్. , ఎన్. ఎఫ్.సి. వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలు హైదరాబాదులో ఏర్పడ్డాయి. నగరం నుండి బయటకు వెలుపలకు వెళ్ళే రైల్వే మార్గాలు ప్రక్కనే ఈ పరిశ్రమలను ఏర్పాటు చేశారు.అంతేగాక నగరం గుండా వెళ్తున్న జాతీయ రహదారుల నెంటే లేఅవుట్కు రాజకీయ, ఆర్ధిక ప్రాతిపదికలతో అనుమతులివ్వడంతో నగరం ఒక నక్షత్రంలా విస్తరించుకు పోయింది. ట్రాఫిక్ అంటే మోటారు వాహనాలే. మోటారులేని వాహనాలు, పాదచారులూ ట్రాఫిక్ క్రిందకు రాకపోగా, రోడ్డును ఆక్రమించేవారుగా పరిగణించబడుతున్నారు.జెఎన్ యు ఆర్ ఎం పధకాలంటూ ఇటీనల విజయవాడ, విశాఖలకు రూపొందిస్తున్న BRTSను చూస్తే పాలకుల ప్రజా వ్యతిరేక వైఖరి అర్ధం అవుతుంది. 20 కి.మీ. దూరం ఉండే BRTC మార్గంలో మిగిలిన ట్రాఫిక్ కోసం 17 ఫ్లైవోవర్లు కడతారట. అంటే పరోక్షంగా మోటారులేనివాహనాలు ప్రధాన రహదారిపైకి రాకుండా చేస్తున్నారు. బస్సులు రోడ్డు మధ్యభాగాన ఆగుతాయి. బస్సు ఎక్కాలంటే ఫుట్ ఓవరు బ్రిడ్జీ ఎక్కి దిగాలి. ముసలివారికి, పిల్లల్తోవెళుతున్నవారి బాధలు చెప్పనలవికాదు. దీని కోసం ఎడమవైపు స్టీరింగు, కుడివైపు ద్వారాలున్న ప్రత్యేక బస్సులు కావాలి. అవికూడా A.C. బస్సులు. ప్రపంచబ్యాంకు ఇచ్చే డబ్బుల్లో 80% ఈ బస్సుల కొనుగోలు రూపంలో ప్రపంచబ్యాంకు ఎంపిక చేసిన కంపెనీకే చేరతాయి. కనుక ఇందులో ప్రజాప్రయోజనాలు ఏమీ లేవు.

మెట్రోరైలు ప్రాజక్టు మొత్తం 71 కి.మీ. దూరం, నేలకు నాలుగంతస్తుల ఎత్తున ఉంటుంది. దీనికయ్యే ఖర్చు రు.12000 కోట్లు. అంటే కి.మీ.కు 169 కోట్ల రూపాయలు . ఈ అంచనాలు కనీసం 30-50 శాతం పెరుగుతాయి. దీనికోసం 5000 వాణిజ్య భవనాలు, 2000 నివాస భవనాలు కూలగొట్టాలి. 12 మీటర్ల ఎత్తున 33 స్టేషన్లు నిర్మించాలి. ఇంతా చేస్తే 2021 నాటికి 25 లక్షల ప్రయాణీకుల్ని చేరవేస్తుందట. అంటే ఇప్పుడు R.T.C.చేస్తున్నంత కూడా చెయ్యదు.

ప్రభత్వం ఈ ప్రాజక్టును ఆదర్శప్రాయం అంటుంది. ఈ ప్రాజక్టుకు 12000 కోట్లు ఖర్చయితే, ప్రభత్వంనుండి సహాయం వద్దనటమేకాక, ఎదురు 30000 కోట్లు ప్రభుత్వానికిస్తానని కాంట్రాక్టు పొందిన మైటాన్ కన్సార్టియం అంగీకరించింది. కాంట్రాక్టు 34 సంవత్సరాలు. ప్రయాణీకుల సంఖ్య తగ్గితే ప్రతివొక్కశాతం తగ్గుదలకూ ఒక ఏడాది లీజు పెంచాలి. ప్రభత్వం 269 ఎకరాలు ఇస్తుంది. ప్రాజక్టు అవసరం కోసం కంపెనీ స్వంతంగా భూసేకరణచేసుకోవచ్చు.దీనిని రియల్ ఎస్టేటుగా అమ్ముకోవచ్చ. స్టేషన్లన్నిటినీ వాణిజ్యభవనాలుగా చేసి అమ్ముకోవచ్చు. 2009 మార్చినాటికి ప్రభత్వానికి 240 కోట్లు చెల్లిస్తుంది.అక్కడనుండి 60 రోజుల్లోగా స్థలాలను ప్రభుత్వం కంపెనీకి ప్పగించాలి. ( భూసేకరణ చట్టం ప్రకారం 90 రోజులు పడుతుంది) ఆలస్యమైతే ప్రతిరోజుకు 24 లక్షల రూపాయల చొప్పన కంపెనీకి ప్రభుత్వం చెల్లించాలి. మెట్రో మార్గంలో R.T.C. బస్సులు నడపకూడదు. రద్దీ సమయంలో అదనపు చార్జీ వసూలు చేస్తారు. ఇవి కొన్ని మాత్రమే. మిగిలిన రాయితీల విషయం దాచివుంచారనీ వాటినికూడా బయటపెట్టాలనీ ప్రొ.సి.రామచంద్రయ్య కోరుతున్నారు. ఇది మెట్రో రైలు ప్రాజక్టు కాదనీ, మెట్రో రియలు ఎస్టేటు ప్రాజక్టుగా మారిందని ఆయన అన్నారు.

అధిక ఖర్చూ, ప్రయాణీకులపై అధిక భారం వేస్తూ ప్రజారవాణాకు తోడ్పడని మెట్రోరైల్వేప్రాజక్టును రద్దుచేయాలి.

Monday, November 10, 2008

భైంసా, వటోలి ఘటనలు

ఆదిలాబాద్ జిల్లా భైంసా, వటోలి తదితర గ్రామాలలో 10.10.2008 నుండి జరిగిన మతఘర్షణలు , పోలీసు కాల్పులు, సజీవదహనాలు, సమాధుల కూల్చివేతలు, తదితర పరిస్థితులను రాష్ట్రనాయకులు కోటయ్యగారి నాయకత్వాన ఒక పరిశీలనాబృందం 16.102008న వెళ్ళి పరిశీలించింది. కర్ఫ్యూ నీడలోనే వివిధరకాల ప్రజలను కలిసింది. భైంసాకి దగ్గరలోని వాలేగాం అనే గ్రామంలో కూల్చివేయబడిన మసీదులను పరిశీలించింది. వటోలి అనే గ్రామంలో అమానుషంగా హత్య చేయబడి సజీవదహనం చేయబడిన మహబూబ్ ఖాన్ ఇంటిని పరిశీలించి గ్రామపెద్దలతో చర్చించింది.

భైంసా ప్రాంతం 1992-96 మతఘర్షణలు రీత్యా సున్నితమైన ప్రాంతం . 10-10-2008, ఆతర్వాత జరిగిన ఘటనల క్రమం ఇలావుంది.

10-10-08 మధ్యాహ్నం 2.45ని. లకు భైంసా పట్టణంలోని పంజేషహ జమా మసీదు ముందు నుండి వెళ్ళే రోడ్డు గుండా దుర్గామాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు సాగుతుంది. ఊరేగింపులో ముందుభాగంలో 30,40 మంది 20,25 సంవత్సరాల యువకులు మసీదు ప్రాంతం వచ్చేసరికి డప్పులూ, బ్యాండు వాయించడమేగాక మసీదుపై పసుపు చల్లారనీ దీనితో ఉద్రిక్తత ఏర్పడిందని తెలుస్తుంది. ఈ కవ్వింపు చర్యలతో మసీదులో అప్పటికే ప్రార్ధన ముగించుకొని ఉన్న ముస్లిం యువకులు స్పందించడం, మసీదుపై రాళ్ళు పడడం, మసీదునుండి కూడా రాళ్ళు విసరడం జరిగింది. ఈ మొత్తం ఊరేగింపులో కేవలం నలుగురు పోలీసులు కేవలం ఊరేగింపు వెనుక నడుస్తూ వచ్చారు. 10వ తేదీ సా.2.45 నుండి 5 గంటలవరకూ వేగంగా జరిగిన పరిణామాలలో గృహదహనాలు, కత్తిపోట్లు, పోలీసు కాల్పులు జరిగాయి. మసీదు నుండి బస్టాండ్ వైపు సుమారు 127 దుకాణాలు తగలబడ్డాయి. మసీదు వెనుకగల ముస్లీముల ఇండ్లకు నిప్పుఅంటించబడింది. తగలబడుతున్న ఒక ఇంటిలోని ముస్లీం కుటుంబం వెనుకనున్న మట్టిగోడను పగులగొట్టుకొని బయటికి రావడానికి సహాయపడి వారిని కాపాడింది కూడా హిందూ కుటుంబాలే. ప్రజలు మతత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడానికి ఇదోఉదాహరణ.

ఇళ్ళూ,దుకాణాలూ తగలబెడుతున్న గుంపు వైపు కాక దీనికి వ్యతిరేకంగా సమీకృతమౌతున్న ముస్లీముల వైపు పోలీసులు తుపాకులు కాల్చారని ముస్లీం పెద్దలు చెపుతున్నారు. ఈ కాల్పుల్లో మొదటి గుండుకి అబ్దుల్ ఖయ్యాం అనే 19 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. మరొక గుండుకి అబ్దుల్ సమీ అనే మరో యువకుడు మరణించాడు. (దుర్గామాత విగ్రహం పెట్టడంలో ముఖ్యపాత్ర వహించిన భైంసాలోని రాజీవ్ నగర్ కు చెందిన బూటాసింగ్ మరణించగా, అతని సోదరుడు గాయపడ్డాడు. ఈ విధంగా ఆరోజు జరిగిన ఘర్షణలో 25 మంది వరకూ గాయపడ్డారు.


భైంసా ఘటనలు జరిగాక భైంసా మండలంలోని వటోలి అనే గ్రామంలో 11వ తేదీ రాత్రి ఆగ్రామంలో వున్న ఒకే ఒక ముస్లీం కుటుంబం మహబూబ్ ఖాన్ ఇంటికి నిప్పు అంటుకుంది. మంటలు మండే సమయానికి ఇంటి వెనుక ఉన్న అమ్మవారి గుడివద్ద భజనలు జరుగుతున్నాయి. మంటలు కనబడగానే గ్రామ ఉపసర్పంచ్ జాదవ్ జగత్ రావు “ ఫైర్ సర్వీసుకి ఫోను చేశామనీ, వాళ్ళు వచ్చాక మంటలు ఆర్పారనీ, కరెంటూ, గ్యాసు స్టవ్వూ ఉంది కనుక ఎవరినీ మంటలు ఆర్పడానికి వెళ్ళవద్దని చెప్పామనీ, తెల్లవారి మహబూబ్ ఖాన్ బంధువులు వచ్చి చూస్తే ఇంటిలో మహబూబ్ ఖాన్, ఆయన భార్య, కూతురు రిజ్వానా , మరో ముగ్గురు చిన్నారులు మంటలలో కాలిపోయారని “ చెప్పాడు. వాస్తవానికి మహబూబ్ ఖాన్ కాలును కుక్కలు గ్రామం ప్రక్కన పొలాల్లోకి లాక్కొని వెళ్ళినట్లుగా పడి వుందని ఇంటివద్దనున్న పోలీసులు చెప్పారు. ఎత్తు తక్కువతో కేవలం మూడు గదులు , ముందు గది ఒక దుకాణంలాగా ఉండే చిన్న ఇల్లు మహబూబ్ ఖాన్ ది . మంచి దర్జీ అని అందువల్లనే గ్రామస్తులు పూర్వం ఆయన్ని ఆ గ్రామంలోకి పిలిపించుకొని నివసించమని కోరారట. మహారాష్ట్రకి చెందిన సైలేన్ బాబాన్ మహబూబ్ ఖాన్ భక్తుడు. గ్రామంలో ఎవరికి దడుపుజ్వరం వచ్చినా ఆయన వద్ద తాయత్తులు తీసుకుంటారు. ఆయన పెద్ద కొడుకు మిలిటరీలో ఉండి , చిన్న కొడుకు , ఇంకో కూతురు చదువుల నిమిత్తం దూరంగా ఉండటం వలన ఆకుటుంబంలో ముగ్గురే మిగిలారు. దేశభక్తి గురించి గొప్పగా చెప్పుకునే వారు, వారి అర్ధంలో దేశరక్షణ బాధ్యతల్లో ఉండి మిలిటరీలో ఉన్న ఒక మైనారిటీ మతానికి చెందిన కుటుంబం పట్ల ప్రదర్శించిన ‘ఔదార్యం’ ఇది. ఇపుడు మీడియాలో 1996 నాటి ఘర్షణల్లో మహబూబ్ ఖాన్ నిందితుడు అని ప్రచారం జరుగుతుంది. నిజంగానే మహబూబ్ ఖాన్ నిందితుడే అయితే అప్పటికి పుట్టని ఈ చిన్నారులు , మహిళలు ఏం నేరం చేశారు? మహబూబ్ ఖాన్ ఇంటి ముందూ వెనుకా ఇళ్ళున్నాయి. ఎవరికీ చిన్నపిల్లల అరుపులు సైతం వినబడలేదని అంటున్నారు.

అదే విధంగా భైంసా నుండి బాసర వెళ్ళే దారిలోని దేవాం గ్రామం ప్రక్కనే గల వాలేగాం గ్రామం – కేవలం 5-6 ముస్లీం కుటుంబాలు నివసిస్తున్న గ్రామం – మొత్తం 200 కుటుంబాల పైనే ఉండే గ్రామం – భైంసా ఘటనల అనంతరం ఆ గ్రామం లోని మసీదు ఒక అర్ధరాత్రి దాడికి గురైంది. మసీదు ప్రహరీగోడ , పైభాగం గోడలు పొడిచి కూల్చివేయబడ్డాయి. తలుపులు కాలబెట్టారు. ఈ ఘటనతో ఆ గ్రామంలోని 6 ముస్లీం కుటుంబాలు భయంతో గ్రామం విడిచి పారిపొయ్యారు. అలాగే తానూరు మండలంలోని ఎవ్వి అనే గ్రామంలో ఇదే విధంగా మసీదు కూల్చివేయబడింది. ఈ విధంగా మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో , ఆదిలాబాద్ జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. ధర్మాబాద్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా దుర్గామాత విగ్రహాన్ని ప్రదర్శనను మసీదు ముందు నుండి తీసుకొని వెళ్ళేలా ప్రదర్శన దారిని మళ్ళించాలని ప్రయత్నించి నప్పుడు హిందూ, ముస్లీం పెద్దలు సమష్టిగా వ్యవహరించి నిరోధించారు. ఈవిధంగా 10వ తేదీనుండి వరుసగా కనబడుతున్న సంఘటనలు కాకతాళీయమైనవికావు. దీని వెనుక లోతైన వేళ్ళను తన్నుకొనజూస్తున్న ఒక విషవృక్షం ఉంది.

Thursday, October 30, 2008

కోస్టల్ కారిడార్

నిర్వాసితులను మోసపుచ్చే వాదనలు :
వాన్ పిక్ పేరిట రైతాంగం భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం పూనుకుంది. గ్రామసభలు జరిపి ప్రజల ఆమోదం పొందిన తరువాత మాత్రమే ప్రాజక్టుల నిర్మాణం చేపట్టాలన్న రాజ్యాంగ చట్టాన్ని ప్రభుత్వమే ఉల్లంఘించి , భూములు వదులుకోవడానికి నిరాకరిస్తున్న రైతులపై నిర్భంధాన్ని ప్రయోగించడానికి పూనుకుంటుంది.
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి తులసిరెడ్డి వాన్ పిక్ ను వ్యతిరేకించేవాళ్ళు అభివృద్ధి నిరోధకులని , ప్రతిపక్షాలు రైతులను,మత్స్యకారులనూ రెచ్చగొడుతున్నాయని ఆరోపించాడు. ప్రభుత్వం 2008 మార్చి నెలలో 'రస్ ఆల్ ఖైమా' అనే సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం మూడు నెలల్లో ఆర్ధికంగా లాభసాటి అవునా కాదా అనే (ఫీజిబిలిటి) రిపోర్టు అందజేయాలి. వాన్ పిక్ కోసం అవసరమైన సాంకేతికత, ఆర్ధిక స్థోమత వున్న ఏ విదేశీ సంస్థనైనా భాగస్వామిగా చేసుకునేందుకు రస్ ఆల్ ఖైమా కు అవకాశం ఇచ్చారు. మాట్రిక్స్ ఎన్ పోర్ట్ అన్న కంపెనీ ఇందులో భారత్ భాగస్వామి. విశాఖలో ప్రైవేటు కంపెనీల బాక్సైటు త్రవ్వకాలు చెల్లవన్న సుప్రీం కోర్టు తీర్పును వమ్ము చేయడానికి , ప్రభుత్వరంగ సంస్థే తవ్వుతున్నట్లు చూపి , రస్ ఆల్ ఖైమాకు ఇచ్చారు. బాక్సైట్, అల్యూమినియం రంగంలో రస్ ఆల్ ఖైమా లేదు. దీనిని శిఖండిగా పెట్టుకొని స్టెరిలైట్ కంపెనీ తవ్వకాలను చేపట్టింది. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలు మన దేశ వనరులను ( విద్యుత్తు,నీరు, ద్రవ్యం, ఖనిజాలు ) ఉపయోగించుకొని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తాయి. ప్రదానంగా రసాయన పరిశ్రమలు. దేశీయ వనరులు విదేశీకంపెనీల లాభాలకు వాడబడతాయి. మనకు మిగిలేది ప్రమాదకర కాలుష్యము, జీవనోపాధి మృగ్యమైన జీవనాలు.

పారిశ్రామికీకరణ జరగరాదని ఎవరూ అనరు, ఇది ఎవరికోసం ఏవిధంగా జరగాలన్నది చర్చ. సామ్రాజ్యవాదులు సహాయం పేరిట రుణాలనిచ్చి, పారిశ్రామిక విధానాన్ని నిర్దేశిస్తున్నారు. ఈ ఋణాల ఉచ్చులో కూరుకుపోయిన భారత పాలకులు ఋణాలను తిరిగి తీర్చాలంటే ఎగుమతులను పెంచి విదేశీమారక ద్రవ్యాన్నఆర్జించాలన్న ప్రపంచ బ్యాంకు సూత్రాలు అమలు జరుపు తున్నారు.దీనినే ఎగుమతి ఆధారిత అభివృద్ధి వ్యూహంగా పిలుస్తున్నారు.
కనుక ఇక్కడ దేశ ప్రజల అవసరాలను తీర్చే పరిశ్రమలు నిర్మించరు . విదేశీ మార్కెట్టులో అమ్ముడయ్యే సరుకుల ఉత్పత్తి కోసమే పరిశ్రమలు పెడతారు. అదీకూడా విదేశీ కంపెనీలే పెడతాయి. ప్రజల అవసరాలు తీర్చకపోయినా , రాయితీల పేరుతో ప్రజాధనాన్ని వారికి ధారపోస్తారు. నూతన ఆర్ధిక విధానాల సారాంశమంతా ఇదే.

Tuesday, October 7, 2008

బీహారు వరద బాధితులను ఆదుకుందాం

కోసీ నది ఉగ్ర రూపానికి ఉత్తర బీహార్ ప్రాంతం అతలాకుతలమైంది. హిమాలయాలనుండి ప్రవహించే గంగానది పరీవాహక నదులలో 3 ముఖ్యనదులైన కోసి, గండకి, భాగమతి నదులు మహా ప్రవాహ శక్తితో ప్రవహిస్తుంటాయి. వీటిలో కోసీ నది ఈశాన్య బీహారు ప్రాంత దుఃఖదాయని అన్నపేరు తెచ్చుకుంది. 1950ల ప్రాంతంలో నేపాల్ నుండి భారత్ లోకి ప్రవహించే కోసీ నదికి ఆనకట్టనూ, కరకట్టలను నిర్మించారు. ఆనాడు ప్రజలు “ సగం రొట్టెనైనా తింటాం కానీ కోసీ నది కరకట్టలను కట్టితీరుతాం “ అని నినాదం ఇస్తూ కరకట్టలను నిర్మించుకున్నారు. అయితే కోసీ ప్రాజక్టు కరకట్టలను పరిరక్షించి మారుతున్న ప్రవాహస్థితులను బట్టి కరకట్టలను అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యతవున్న బీహారు రాష్ట్రప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహించిన ఫలితంగా ఈ సంవత్సరం ఆగష్టు 18 న కోసీ నది కరకట్టలపై గండిపడి మహోగ్ర రూపంతో బీహారు రాష్ట్రంపై విరుచుకు పడింది. ఈ పడిన గండి వెడల్పే రెండు కిలోమీటర్లు ఉంటుంది.
ఉధృతమైన కోసీ నది తాకిడికి ఉత్తర బీహారు జిల్లాలైన సుపాల్, మాధేవురా, అరారియా, సహర్ద జిల్లాలు తీవ్రంగానూ, ముజఫర్ పూర్, కథియార్, సీతామతి, భతల్ పూర్ తదితర మొత్తం 16 జిల్లాలు అతలాకుతలమైనాయి. మొత్తం 30 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులై కొంప, గోడు, చేనూ, చెలక వదిలిపెట్టి ప్రభుత్వ స్కూళ్ళూ, దేవాలయాల్లో తలదాచుకుంటున్నారు. వందలమంది వరదల ఉధృతికి మరణిచారు. ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయక సిబిరాలకు చేరినవారు త్రాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరకక, పారిశుధ్య సమశ్యలతో అల్లాడుతున్నారు. కోసి నది కరకట్టకు పడ్డ ఈ గండిని పూడ్చడానికి నాలుగు నెలల నుండి ఆరు నెలల సమయం పడుతుందని నది ఉధృతిని గమనిస్తూన్న నిపుణులు వివరిస్తున్నారు. కనీసం పది లక్షలమంది అంతకాలం వరకు పునరావాస కేంద్రాలలోనే తలదాచుకోవలసి వస్తుందని పరిస్తితులు తెలియజేస్తున్నాయి.
భారతదేశంలో ఇప్పటిదాకా జరిగిన వైపరీత్యాలలో కనిపించిన వాస్తవమే మరోసారి ఇక్కడా కన్పిస్తుంది. అదేమంటే సాటిప్రజలు , మానవతావాదులు, ప్రజాతంత్రవాదులు స్పందించి, బాధితులను అక్కున చేర్చుకొని అందించిన సహాయమే బాధితులను నిలబెట్టిందికానీ ప్రభుత్వాలు విదిలించే నిర్లక్ష్యపూరిత అరకొర సహాయం కాదన్న వాస్తవం మరోసారి ఇక్కడ ధృవపడుతుంది.
బీహారు వరదబాదితుల సహాయార్ధం ‘ బీహారు వరద బాధితుల సహాయ కమిటీ ‘ ఏర్పడింది. ఈ కమిటీకి మందులు, బట్టలు, ఆహారం తదితర రూపాలలో సహాయం అందించవలసినదిగా యావత్తు ప్రజలకూ, మానవతావాదులకూ , సంస్ధలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
పాట్నా కేంద్ర వివరము:
Dr.ARAVIND SINHA,
Barh Parnagrik Pahal,
East & West Educational Society,
Arogya Mandir Complex,
Nala Road,
PATNA-800 004,
Ph: 09430060092.

ఆంధ్రప్రదేశ్ లో పాదార్ధిక, ఆర్ధిక సహాయం కోసం ఏర్పడిన కేంద్రం చిరునామా:
ఎస్. ఝాన్సీ,
ఆంద్రాబ్యాంకు బిల్డింగ్,
కృష్ణలంక,
విజయవాడ- 500 013.
సెల్ : 94403 19977

Wednesday, September 24, 2008

పరాన్నజీవిగా అమెరికా సామ్రాజ్యవాదం

తనఖా ద్రవ్య సంస్థలైన ఫాన్నీమే , ఫెడ్డీమాక్ కంపెనీలను అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ రెండు సంస్థలూ కలిపి 5 లక్షల 30 వేల కోట్ల డాలర్ల అప్పుల్లో మునిగిపోయాయి. అమెరికా గృహ రుణాలలో 80 శాతాన్ని ఈ రెండు కంపెనీలే తనఖా పెట్టుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ అప్పులు తీరుస్తానని హామీ పడింది. ప్రజలనుండి వసూలు చేసిన పన్నుల నుండే ఈ అప్పులు తీరుస్తుంది. దీని అర్ధమేమిటి? గుత్తపెట్టుబడదారులకు వచ్చిన నష్టాలను సమాజపరం చేస్తారు. లాభాలను ప్రవేటు పరం చేస్తారు.
రెండు కంపెనీలను రక్షించడానికి ఖర్చుపడుతున్న ఈ సొమ్ము ప్రజలకోసం వెచ్చించే సొమ్ముతో పోల్చి చూస్తే అమెరికా ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో తెలుస్తుంది. విద్యకు 6 వేలకోట్ల డాలర్లు, నిరుద్యోగ భృతికి 3 వేలకోట్లు, రహదారులకోసం 5 వేలకోట్లు, గృహవసతి కల్పనకు 7000 కోట్లు మాత్రమే. కంపెనీలు తమ పెట్టుబడితో జూదమాడుతాయి. లాభాలొస్తే తమ బొక్కసాలు నింపుకుంటాయి.నష్టాలు వస్తే ప్రజలు భరించాలి. ఇది సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థ దివాళాకోరు తనాన్ని తెలుపుతుంది.

Tuesday, September 23, 2008

పాకీస్తానీ ప్రజాతంత్ర కవి అబ్దుల్ ఫరాజ్

పాకీస్తానీ నియంతలకు పక్కలో బల్లెమై నిలచిన పాకీస్తానీ ప్రజాతంత్ర కవి అబ్దుల్ ఫరాజ్
“నిరంకుశత్వ మేదియైన నిలువలేదు జగతిపై
దురాత్ములైన హిట్లరాదు లొరిగిపోయి రుర్విపై
ప్రజావిరోధి ఎవ్వడైన బ్రతుకలేడు నిశ్చయం
ప్రజాబలాల ధాటినాప ఎవరితరము కాదుపో “

అని మన తెలుగు ప్రజాకవి సుంకర సత్యనారాయణ తన మార్చింగ్ సాంగ్ లో నియంతలనూ, ప్రజా వ్యతిరేకులను ప్రతిఘటిస్తూ వ్రాశారు. పాకిస్తాన్ లోని సైనిక నియంతృత్వాన్ని ప్రతిఘటిస్తూ రచనలు సాగించిన కవుల్లో ప్రముఖుడు అబ్దుల్ ఫరాజ్ . ఆయన కోహట్ సమీపాన గల ఒక గ్రామంలో 1931 జనవరి 14 న జన్మించారు. తన 77 వ ఏట మొన్న 2008 ఆగష్టు 25వ తేదీన ఇస్లామాబాద్ లో మూత్రపిండాల వ్యాధితో మరణించారు. ఉర్దూ సాహితీ ప్రపంచంలో ఫరాజ్ నియంతల ప్రజా వ్యతిరేకతను సూటిగా , నిష్కర్షగా తన కవితలలో , గజల్లలో ఎండగట్టాడు. ఉదాహరణకు “ పెషావర్ ఖతి” లో “ తుమ్ సిపాహీ నహీం” అనే పాదంతో ప్రారంభమయ్యే కవిత ఇలా సాగుతుంది. తూర్పు పాకీస్తాన్ ( ఇప్పుడు బాంగ్లాదేశ్ ) లో , బెలూచీస్తాన్ లో పాకీస్తానీ సైన్యం సృష్టించిన దారుణ మారణ కాండను ఖండిస్తూ ఈ కవిత వ్రాశాడు.
“ మీరు వృత్తి హంతకులు, సైనికులు కారు
ఇప్పటి వరకు మీ కోసం విషాద గీతికలు
రచించాను
అవి రాసినందుకీనాడు సిగ్గుతో చితికి
పోతున్నాను
ఆ తూర్పున ఉన్నవాళ్ళు - మన రక్తసంబంధీకులే
వాళ్ళు మనవాళ్ళే ...మీరేమో వారి రక్తంతో హోలీ
చేసుకుంటున్నారు.
.................
వారి అదృష్టాలను మరల్చడానికి వెళ్ళారక్కడికి
మీరు చేసినదాని ఫలితం చూడండిప్పుడు
మీ లైంగిక అత్యాచారాల ఫలితం ఈనాటి
వారి పిల్లలు.
.........................
బెంగాల్ లో రక్తస్నానం పూర్తిచేసి
ఇక బయలుదేరారు బోలన్ పౌరుల
గొంతులు కోయడానికి “
ఫరాజ్ అసలు పేరు సయ్యద్ మహమ్మద్ షా . ఫరాజ్ అనేది ఆయన కలం పేరు. తండ్రి ఆగా సయ్యద్ మహమ్మద్ షా బార్క్ కోహట్ సంప్రదాయ కవిత్వరచనలో పేరు గడించినవాడు.
ఫరాజ్ పెషావర్ విశ్వవిద్యాలయంలో ఉర్దు, పర్షియన్ భాషలలో ఎం.ఏ. పట్టా పొంది ఆ విశ్వవిద్యాలయం లోనే అధ్యాపకునిగా పని చేశాడు. 1976 లో పాకీస్తాన్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అనే సాహిత్య అకాడమీకి సంస్థాపక డైరెక్టర్ జనరల్ గానూ, ఆ తర్వాత చైర్మన్ గానూ పనిచేశాడు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక కవి సమ్మేళనంలో తాను వ్రాసి, చదివిన కవితల కారణంగా అరెష్టు అయ్యాడు. భుట్టో నాయకత్వంలోని పాకీస్తాన్ పీపుల్స్ పార్టీలో పనిచేశాడు. 2004లో ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అయిన హిలాల్ -ఇ-ఇమితియాజ్ ను పొందాడు.
అయితే ఇటీవల న్యాయమూర్తులను పదవులనుండి తొలగించడం, అమెరికాకు తొత్తుగా మారడం వంటి ముషారాఫ్ చర్యలకు నిరసన తెలియజేస్తూ 2006 లో ఆ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. 2007 నవంబరులో ఢిల్లీలో రెండు దేశాల మధ్య సంబంధాల గురించి, రెండు దేశాలలోని ఉర్దూ సాహిత్యం గురించి గొప్ప ఉపన్యాసము ఇచ్చారు. ఆయన మరణం ఇరు దేశాల సాంస్కృతిక ఉద్యమానికి ఒక లోటుగా పరిగణించక తప్పదు.

Wednesday, September 10, 2008

గుడ్డీగ

మంచోడి బుధ్ది మాంసం కాడ బయటపడ్డట్టు
బుద్ధదేవ్ ఎవరి పక్షమో నందిగ్రామ్ లో తెలిసిపోయింది
నీరు పల్లానికే ప్రవహించినట్టు
పాలక కమ్యూనిష్టుపార్టీ
టాటాలు , సలీంల వైపుకు పరుగెత్తుతున్నాయి
పోరాడితే పోయేదేమీలేదని చెప్పేవాళ్ళు
పోరాడే ప్రజల్ని
పిట్టల్లా కాల్చి చంపుతున్నారు
నీడనివ్వాల్సిన చెట్టు నిప్పులు కురిపించిందిక్కడ
కట్టుకున్న చీరే కామంతో శీలం దోచిందిక్కడ
కాపాడాల్సిన కమ్యూనిష్టే కసాయిగా మారి
మరతుపాకులెత్తి మట్టి మనుషుల మానప్రాణాలు తీశాడిక్కడ
దేవాలయాల మెట్ల వద్ద
మంచినీళ్ళ బావుల దగ్గర
సవర్ణులు దళితుల్ని తరిమి కొట్టినట్టు
పచ్చటి పంట పొలాల్లో
పారిశ్రమిక పెంటదిబ్బల్ని వొద్దన్నందుకు
మనిషి వాసన తగిలితేనే బుసలు కొట్టే క్రూరజంతువులా
పీడితులపై బులెట్ల వర్షం కురిపించాడు అభినవ డయ్యరిష్టు
శ్రమైక జీవన సౌందర్యానికి
పట్టాభిషేకం చెయ్యాల్సినవాడు
శ్రమజీవుల పొట్టలుగొట్టి
బూర్జువాలకు పట్టంగడుతున్నాడు
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వుద్యమించాల్సిన కార్మికరాజ్యం
తలుపులు బార్లా తెరిచి పెట్టుబడిదారులకు స్వాగతం
పలుకుతుంది
రైతు కూలీలు జిందాబాద్
రైతురాజ్యం సాధిస్తామ్ అని నినదించే వామపక్షీయులు
లాఠీలై , తూటాలై
ప్రజాపోరాటాల్ని నెత్తురుటేరుల్లో ముంచెత్తుతున్నారు
పేదలకు భూములు పంచాలంటు
దున్నేవాడికే భూమి దక్కాలంటూ
వ్యవసాయిక విప్లవం వర్ధిల్లాలంటూ
రైతు సంఘాలై వ్యవసాయ కార్మిక మహాసభలై
భూమికోసం భుక్తికోసం ఈ దేశ విముక్తికోసం
పోరుచేసే కమ్యూనిష్టు పార్టీ
పంటభూముల్లో రసాయనిక పరిశ్రమలు ఎందుకన్న నేరానికి
పచ్చటి నేలంతా నెత్తుటిమయం చేసింది
ఇల్లలికి ముగ్గు పెట్టుకొని
తన పేరు తానే మరచిపోయిన గుడ్డీగలా
వర్గాన్ని, వర్గపోరాటాన్ని మరచిపోయారు
“ భారతీయ కమ్యూనిష్టులు “
అధికారపు మత్తులో కూరుకుపోయి
ప్రజల్ని మరచిన
ప్రభుత్వ కమ్యూనిష్టులారా !
నందిగ్రామ్ లో ఉవ్వెత్తున లేచిన నెత్తుటి కెరటం
అణగారిన ప్రజల గుండెల్లో రగిలే తఫానుకు సూచన.
ఇక మీ పతనం తప్పదు
-----
మల్లిఖార్జున పిల్లి

Thursday, August 14, 2008

పార్లమెంటరీ ప్రహసనం

వామపక్ష కూటమి యూపీఏ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న జులై 7వ తేదీ నుండి పార్లమెంటు విశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగిన జులై 22వ తేదీ వరకూ సాగిన ఘటనల క్రమమంతా భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో తేటతెల్లం చేసింది.బడా పరిశ్రమాధినేతలు నడుంబిగించి బరిలోకిదిగారు.హత్యలూ, కిడ్నాపులవంటి తీవ్ర నేరారోపణలతో జైలులో వున్న ఎంపీలు విడుదలై వచ్చి, సగౌరవంగా పార్లమెంటులో ప్రవేశించి మైనారిటీ ప్రభుత్వాన్ని బలపరచారు. ఇతర దేశాల రాయబారులు రాజకీయ పార్టీల నేతలను కలసి మంతనాలాడారు. అరుపులూ, నోట్ల కట్టల ప్రదర్శనల మధ్య అసలు మీద ఏ చర్చా జరగకుండానే విశ్వాస తీర్మానం నెగ్గింది. ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని మీరారంటూ దాదాపు అన్ని పార్టీలూ తమ సభ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టబోవడం గమనిస్తే , ఈ బేరసారాలు లేకపోతే ప్రభుత్వం ఓడిపోయి వుండేదన్నది అందరికీ అర్ధమైన విషయమే.

Tuesday, August 12, 2008

ఆగష్టు 20 సార్వత్రిక సమ్మెను విజయవంతం చెయ్యండి

అధిక ధరలను, ఇతర కార్మిక సమస్యలనూ వ్యతిరేకిస్తూ , ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలోని కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయవర్గం అంతా ఆగష్టు 20 న సార్వత్రిక సమ్మె జరపాలని , దేశంలోని వివిధ కార్మిక సంఘాలూ, ఫెడరేషన్లూ, అసోసియేషన్లతో కూడిన స్పాన్సరింగ్ కమిటీ మే 13 వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ట్రేడ్ యూనియన్ల జాతీయ సదస్సులో నిర్ణయించడం జరిగింది.
తిరిగి జులై 8 న 800 మంది ప్రతినిధులతో జరిగిన జాతీయ సదస్సు సమావేశం ఆగష్టు 20వ తేదీన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఒక రోజు సమ్మె జరపాలన్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ. సమ్మెకు ఘనవిజయం చేకూర్చాలన్న ధృడ సంకల్పాన్ని ప్రకటించింది.
సత్వరమే ధరల పెరుగుదలను అదుపు చేయాలని,
కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలనీ,
కాంట్రాక్టీకరణ- ఔట్ సోర్సింగులను నిలుపుదల చెయ్యాలనీ,
అసంఘటితరంగ కార్మికులందరికీ సామాజిక భద్రతాబిల్లు పరిధిని విస్తరింప చేయాలనీ,
రైతులకు ప్రయివేటు వ్యాపారస్తులనుండి తీసుకున్న రుణాలను కూడా రద్దు చేయాలనీ,
రైతులకు తక్కువ వడ్డీ రేటుపై జాతీయ బ్యాంకులు తేలిక రుణాలు ఆందించాలనీ,
ప్రభుత్వ రిక్రూట్మెంటుపై ఉన్న నిషేధాన్ని రద్దు చేయాలనీ,
కాంట్రాక్టు కార్మికులతోసహా , అన్నిరకాల కార్మికులకు నూతన వేతన ఒప్పందాలు జరుపాలనీ
ఈ స్పాన్సరింగు కమిటీ డిమాండ్ చేస్తుంది.

ఆగష్టు 20న సమ్మె జరపడమేకాక కుదిరిన చోట్ల బందులు కూడా జరపాలనీ , ఈ సార్వత్రిక సమ్మె విజయవంతం చేయడం కోసం ముమ్మరంగా ప్రచారకార్యక్రమాల్ని నిర్వహించాలనీ కూడా ఈ స్పాన్సరింగ్ కమిటీ కోరుతుంది.

కార్మికులారా పోరాడండి.
మీకు పోయేదేంలేదు, బానిస సంకెళ్ళు తప్ప.

Sunday, June 22, 2008

గ్యాసుకు 50 రూపాయలివ్వడం ఉత్త గ్యాసేనా?

పెట్రోలును లీటరుకు 5 రూపాయలూ, డీజిలు 3 రూపాయలూ, గ్యాసు సిలెండరును 50 రూపాయలు పెంచింది. పెట్రోలు, డీజిలు పై ఎక్సైజు సుంకాన్ని 1 రూపాయి , దిగుమతులపై కష్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించింది. ప్రజలపై 45,000 కోట్ల రూపాయల భారం మోపింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 11 శాతానికి పెరిగింది , అంటే ధరలు బాగా పెరిగాయి.
ధరలు తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వాలు తమ అమ్మకం పన్నును తగ్గించుకోవాలని కేంద్రం కోరింది. పెంచిన ధరలు తామే భరించి , పాత ధరలకే అమ్ముతామంటూ ప్రకటించారు. ఇది అసలు విషయాన్ని తిరగేసి చెప్పటమే. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాల అమ్మకం పన్ను 20-30 శాతం వరకూ ఉంది. దినివల్ల రాష్ట్రాలకు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నే తీసుకుంటే కేంద్రం పన్ను తగ్గించినందువల్ల 600 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. అంతకు ముందు 1800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కాగా ధరలు పెరిగినందున పన్నురేటు తగ్గించినా , అమ్మకం పన్ను నుండి ఆదాయం 425 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అంటే ఆదాయంలో తగ్గుదల 175 కోట్ల రూపాయలు మాత్రమే. ముఖ్యమంత్రి - పెంచిన గ్యాసు ధర 50 రూపాయలూ పెంచకుండా , పాతధరకే అమ్ముతానని - ప్రకటించాడు. దీనివల్ల అదనంగా రావలసిన అమ్మకం పన్ను ఆదాయాన్ని మాత్రం కోల్పోతాడు తప్ప, తాను నష్టపోయేదో, తాను భరించేదో ఏమీలేదు. ప్రజలంటే మరీ అంత అమాయకంగా కన్పిస్తారా పాలకులకు ?

Sunday, June 15, 2008

మానవీయ సహాయం పేరిట ఆధిపత్య రాజకీయం

2008 మే 3వ తేదీన తుఫాను నర్గీన్ మయాన్మార్ పై విరుచుకపడింది.-28458 మంది మృతి చెందారని , 33416 మంది జాడ తెలియడంలేదని అధికార ప్రకటన తెలుపుతుండగా అనధికారిక అంచనా ప్రకారం 20 లక్షలమంది నిర్వాసితులయ్యారు. కూడూ,గూడూ,మంచినీరు, ఔషధాలు లేక అల్లాడుతున్నారు. కాగా ఐక్యరాజ్యసమితి మానవవ్యవహారాల సమితి మృతుల సంఖ్య 64వేల నుండి లక్ష మధ్యన వుండవచ్చనీ, 2 లక్షల 20 వేల మంది జాడ తెలియడం లేదని తెలుపుతూ, ఆహారం, నీటి కొరతవల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తి హింసాకాండ చెలరేగవచ్చని భయాన్ని వ్యక్తం చేసింది.
తుఫానుకు తీవ్రంగా గురైన ఐరావతి నది డెల్టా పల్లపు ప్రాంతమే కాక, ఉపనదులూ, కాలవలతో కూడివుంది. రోడ్డు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. పడవలు, హెలీకాఫ్టర్లు మాత్రమే ఆప్రాంతానికి చేరగలుగుతున్నాయి. ఆహారాన్ని చేరవేస్తున్న రెడ్ క్రాస్ వారి పడవ ఒకటి నదిలో మునిగిపోయిందంటే సహాయ కార్యక్రమాల నిర్వహణ ఎంత కష్టతరంగా ఉందో అర్ధమౌతుంది. చాలా పరిమితంగా సహాయం అందుతుంది. లబుట్టా పట్టణంలో 117 శిబిరాలలో, 150000 మంది శరణార్ధులుగా ఉన్నారు. వీరికి మాత్రం సహాయం అందజేయగలిగారు.
బర్మాలోని సైనిక పాలకులు తగిన విధంగా సహాయం అందించలేక పొయ్యారు. పేదదేశం, వనరులకొరత వంటి కారణాలతోపాటు సహాయ చర్యలు తీసుకోవడంలో సైన్యం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించింది. దీనినానరాగా తీసుకొని అమెరికా నిందాప్రచారం ప్రారంభించింది. అంతర్జాతీయ సమాచార వ్యవస్థ మన్మయార్లో జరిగిన భీభత్సాన్ని పదే పదే ప్రచారం చేశాయి. లక్షలాది ప్రజలు ఏదిక్కూలేకుండా పోతున్నారని కన్నీరు కార్చింది. మన్మయార్ పాలకులు సహాయమందించరనీ, ప్రపంచ మానవాళే మన్మయార్ ప్రజలను ఆదుకోకుంటే ఒక మానవ సంక్షోభం ఏర్పడుతుందనీ ప్రచారం చేసింది.’టైమ్స్ ’ పత్రికయితే ‘ బర్మా ఆక్రమణకు సమయమిదేనా ? ’ అని ప్రశ్నించి మానవీయ సహాయమందించడానికి ఆక్రమణే సరైన చర్య అని తేల్చింది. అయితే ప్రపంచ దేశాలు దీనిపై ఒక నిర్ణయానికి రావాలి. అలా వచ్చేసరికి సమయం మించిపోతుంది అంటూ కలరా వచ్చాక జనం చనిపోతే సైనిక జోక్యం చేసుకోవడానికి కారణం దొరుకుతుందంటూ వ్యాసాన్ని ముగించింది.
అమెరికా మంత్రిణి కండోలెస్సారైస్ “ప్రపంచ దేశాలు సహాయ మందించడాన్ని బర్మా ప్రభుత్వం అంగీకరించాలి. ఇవి రాజకీయాలు కావు. మానవ సంక్షోభ సమస్య ” అంది. 35 లక్షల డాలర్లను సహాయంగా ప్రకటించింది. అయితే ప్రకటించకుండా విధించిన షరతులేమంటే అమెరికా నావికా సైన్యం తన స్వంత యుధ్ద నౌకలతో , సైనికులతో మన్మయారుకు వెళ్ళి తానే స్వయంగా సహాయమందించడానికి మన్మయార్ ప్రభుత్వం అంగీకరించాలట. సహజంగానే మన్మయార్ ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. వస్తురూపంలో సహాయమందజేస్తే తాను తన దేశ ప్రజలకు ఆందజేస్తానని , ఐ.రా.స. గుర్తింపు పొందిన ప్రభుత్వేతర సంస్థలను అనుమతిస్థానని, విదేశీ సైనికులను అనుమతించనని స్పష్టం చేసింది.
గతంలో సునామీకి గురైన దేశాలన్నీ మన్మయార్ లాగా పేదదేశాలే. బాధితులకు సహాయమందించడంలో చాలా లోపాలు జరిగాయి. బాధితులకు సహాయమందించే, సహాయసంస్థలు వేటినీ ఇండోనేషియా సైన్యం ఆ ప్రాంతంలోకి రానివ్వలేదు. తమ ద్వీపానికి స్వాతంత్ర్యం కావాలని పోరాడుతున్న అసెసిస్ తిరుగుబాటుదారులను ( సునామీకి గురై కష్టాలలో ఉన్నవారిని ) నిర్మూలించేందుకు అవకాశంగా వాడుకుంది. అయినా ఇండోనేషియా ప్రభుత్వం అమెరికా కనుసన్నలలో నడుస్తోందిగనుక ఆనాడు “ మానవ సంక్షోభం ” అనేది అమెరికాకు కన్పించలేదు.
అలాగే సునామీకి గురైన తమిళ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను కలిసి నిర్వహిద్దామని శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీఈ ప్రతిపాదించింది. అలా చేస్తే ఎల్టీటీఈని అధికారికంగా గుర్తించినట్లవుతుందని శ్రీలంక ప్రభుత్వం నిరాకరించడమేగాక , ఆ ప్రాంతంలో సహాయకార్యక్రమాలు నిర్వహించలేదు. అయినా అమెరికాకు “ మానవ సంక్షోభం ” కన్పించలేదు.
సునామీకి గురైన అండమాన్ నికోబార్ దీవులలో సహాయ కార్యక్రమాలను తానే నిర్వహించుకుంటానని, విదేశీ సైన్యాల సహాయమవసరంలేదని భారత ప్రభుత్వం అన్నా అమెరికా పాలకులకు కోపం రాలేదు. భారత సార్వభౌమత్వాధికారాన్ని కాదని అమెరికా సైన్యం సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న ప్రతిపాదనేదీ ఆనాడు ఎవ్వరూ చేయలేదు. కానీ ఇండోనేషియా, శ్రీలంకల మీద తీవ్ర వత్తిడితెచ్చి, అమెరికా సైన్యం ప్రవేశానికి ఆమోదం పొందారు. ఆయా దేశాల సైన్యాలతో కలసి అక్కడి తిరుగుబాటుదారులను అణచడంలో సహాయపడే లక్ష్యంతో ఇది జరిగింది.
ప్రాన్సు,బ్రిటన్లు అమెరికాతో కలిసాయి. ఐరాస తన అధికారాలను వినియోగించుకొని బర్మా ప్రభుత్వం అంగీకరించినా లేక తిరస్కరించినా మాసైన్యాలు బర్మాలో సహాయమందిచేలా తీర్మానం చెయ్యాలని భద్రతామండలిని ప్రెంచి విదేశాంగశాఖామంత్రి కోరాడు.బర్మాకు వచ్చే విదేశీసహాయాన్నంతా ఒక పధ్దతిగా అందించేందుకు ఆగ్నేయాసియా దేశాధినేతలు సమావేశమై , ఒక అంగీకారానికి వచ్చి తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసారు. మానవీయ సహాయం , జోక్యం పేరిట అమెరికా ఆధిపత్య వ్యూహాన్ని అమలు చేస్తుంది. తూర్పు తైమూరులోనూ, కొసావోలోసూ మానవీయ సహాయం పేరిట అది తీసుకున్న సైనిక చర్యలు లక్షలాది ప్రజలను మృత్యుజ్వాలలకు ఆహుతి చేసాయి. “ మేమింకా ఏకపక్ష సైనిక జోక్యాన్ని వదులుకోలేదు. ఎందుకంటే వ్రజలకు మేమే సహాయం అందించాలని కోరుకొంటున్నాం ” అని ఫ్రెంచి విదేశాంగమంత్రి అన్నాడు. తమ మాట వినకుండా చైనాతో సంబంధాలు బలపర్చుకొంటున్న మన్మయార్ సైనిక పాలకులను తొలగించాలన్న లక్ష్యమే అమెరికా సామ్రాజ్య వాదులది. అంతే తప్ప మన్మయార్ ప్రజల కడగండ్లు గాని, ఆ ప్రజల ప్రజాస్వామ్య హక్కులపట్ల ప్రేమగాని సామ్రాజ్యవాదులకు లేదని, తుఫాను భీభత్సాన్నికూడా ఆధిపత్య ప్రయోజనాలకు వినియోగించుకోజూస్తున్న సామ్రాజ్యవాదుల వైఖరి తెల్పుతుంది.

Thursday, June 12, 2008

జాతి వైషమ్య రాజకీయాల అసలు రూపం

తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన సామ్రాజ్యవాదులు సంక్షోభ భారాన్ని ప్రజలపై మోపేందుకు ( కార్మికులను పనిలోనుండి తొలగించడం, పన్నుల పెంపు, సంక్షేమ చర్యలలో కోత మొదలగునవి ) తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూనే అసలు సమస్యల నుండి ప్రజల చూపు మళ్ళించేందుకు జాతి వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. జాతివైషమ్యాలను సాకుగాచూపి ప్రజలను అణిచివేసే నిరంకుశాధికారాలను పొందుతున్నారు. యూరపు దేశాలలో పెరుగుతున్న నిరుద్యోగానికి బయటినుండి వస్తున్న కార్మికులను కారణంగా చూపుతున్నారు. దక్షిణాసియానుండి వలస వచ్చిన వారిపై జాతి వివక్షతను రుద్దుతూ , వారిపట్ల బ్రిటన్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.జర్మనీలో పాలకుల అండదండలతో నయా నాజీశక్తులు ఆసియా నుండి వలస వచ్చిన శ్రామికులపై దాడులు సాగిస్తున్నాయి. మూడవ ప్రపంచదేశాల శ్రామిక శక్తిని చౌకగా వినియోగించుకొని అమెరికా లాభాలు గడిస్తుండగా, తాము దానితో పోటీ పడలేకపోతున్నామంటూ యూరోపియన్ యూనియన్ వలసలను ప్రోత్సహిస్తున్నది. దీనిని దాచిపెట్టి నిరుద్యోగానికి వలస శ్రామికులనే కారణంగా చూపుతూ యూరపు ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. ఇటలీలో ఇటీవలి పరిణామాలు సామ్రాజ్యవాదపాలకుల దివాలాకోరు విధానాలను బయటపెడుతున్నాయి.
సోషలిష్టు శిబిరంగా వున్న దేశాలలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, పశ్చిమ యూరపులోని పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారంటూ ప్రచారం సాగించారు. కాగా రష్యాశిబిరం కూలిపోయి తూర్పు యూరపు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఆయా దేశాలనుండి ప్రజలు పని వెతుక్కుంటూ పశ్చిమ యూరపు దేశాలకు వలస వచ్చారు.అల్బేనియా, యుగోస్లావియా, రుమేనియా దేశాలనుండి వేలాదిమంది పడవలలో మధ్యధరా సముద్రంలో పయనించి ఇటలీ చేరుకున్నారు. వలసలు జరుగుతున్నాయని తెలిసికూడా చూసీచూడనట్లు ఉండి ఇటలీ పాలకులు వీటిని ప్రోత్సహించారు. కరెంటు, మంచినీరు సరఫరా లేని మురికివాడల్లో నివశిస్తూ అత్యంత హీనంగా జీవితాలు సాగిస్తూ అత్యంత నికృష్ట దోపిడీకి ఈ వలస శ్రామికులను ఇటలీ పాలకులు గురిచేసారు.
ఐరోపా ఖండం లోని ప్రజలంతా స్వేచ్ఛగా ప్రయాణించేలాగా చేయబడిన యూరోపియను చట్టానికి వ్యతిరేకంగా 2007 నుండి శ్రామికులపై భౌతిక దాడులకు పూనుకున్నారు. ఒక రుమేనియా వలస పౌరుడు ఒక ఇటలీ మహిళపై దాడి చేశాడన్న వదంతిని మీడియా ఎడతెగకుండా ప్రచారం చేసింది. అప్పటి ప్రతిపక్షంలోని ‘బెర్లుస్కోనీ ‘ అనే నాయకుడు విదేశీయులకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా రుమేనియన్లకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. అతని పత్రిక కూడా “ సంచారుల దురాక్రమణ “ అనే శీర్షికతో ప్రచారం చేసింది. వీరి ప్రచారంతో రోమునగరమేయరు వాల్టరు వెల్ట్రోనీ గొంతు కలిపాడు.నగరంలోని నేరాలలో 75 శాతానికి రోమా ( రుమేనియా నుండి వచ్చినవారు ) లే కారణమని ప్రకటించాడు.వీరిని దేశం నుండి బహిష్కరించేందుకు చట్టం చేయమని పాండీ ప్రభుత్వాన్ని కోరాడు. ప్రభుత్వం 181 సంఖ్య డిక్రీని చేసింది. 5000 మంది లిష్టును తయారు చేసింది. తదనంతర ఎన్నికల్లో బెర్లుస్కోనీ ఎన్నికయ్యాడు. విదేశీయులని అరెష్టు చేసి కేసులు పెట్టారు.మాఫియా ముఠాలు ఆసిడ్ బాంబులతో దాడులు చేసింది. నేపుల్సు నగరంలోని చెత్త సమస్యకు వలనకారణమని, కనుక మురికివాడలను మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. “ ఈ జిప్సీలను నిర్మూలించడంకంటే ఎలుకలను నిర్మూలించడం సులభం ” అని ప్రకటించారు.

Monday, June 9, 2008

నేపాల్ ప్రజలకు అభినందనలు

2008 మే 28 నుండి రాచరికాన్ని కూలద్రోసి , స్వతంత్ర , లౌకిక , ఫెడరల్ రిపబ్లిక్కుగా నేపాలు ఏర్పడడాన్ని సి.పి.ఐ. (ఎం.ఎల్.) కేంద్ర కమిటీ స్వాగతిస్తున్నది. ఈ పరిణామంతో ఫ్యూడలిజానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా నేపాలు ప్రజలు సాగిస్తున్న పోరాటం ఒక నూతన దశకు చేరింది. ఈ పోరాటం కొనసాగుతుందని ఆకాంక్షిద్దాం.